ఆఫ్ఘనిస్థాన్లో పనిచేస్తున్న బ్రిటీష్ బలగాలు కొత్త చిక్కుల్లో పడ్డాయి. మాదక ద్రవ్యాలను దేశం దాటిస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఆఫ్ఘనిస్థాన్లోని మిలిటెంట్ల ఏరివేతలో సహాయం అందిస్తున్న బ్రిటీష్ సైనిక బలగాలు హెరాయిన్ను ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో బ్రిటీష్ మిలటరీ పోలీసులు వారిని విచారిస్తున్నట్లు రక్షణ శాఖ మంత్రిత్వ వర్గాలు వెల్లడించాయి.
ఈ ఆరోపణలపై విచారణ ప్రారంభించామని అధికారులు తెలిపారు. సదరు మిలటరీ అధికారుల సైనిక విమానాల ద్వారా మాదక ద్రవ్యాలను తరలించి దేశం దాటిస్తున్నారని, ముఖ్యంగా విమానాశ్రయాలలో ఉన్న బలగాలు, క్యాంప్ బేసిన్, కాందహార్లో ఉన్న సైనికులు ఈ ఆరోపణలు ఎదుర్కుంటున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర విచారణకు ఈ ప్రాంతాలలోని సైనికులను మిలటరీ అధికారులు విచారిస్తున్నారు.
ఈ విచారణలో భాగంగా నిందితులను గుర్తించేందుకు శిక్షణ ఇచ్చిన శునకాలను రంగంలోకి దింపామని, ఇటువంటి ఆరోపణలపై తాము అప్రమత్తంగా ఉన్నామని రక్షణ శాఖ మంత్రివర్గ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఒకవేళ ఈ ఆరోపణలు కనుక నిజమైతే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment