Friday, September 17, 2010

ప్రపంచంలో ప్రతి 6 సెకన్లకు ఓ శిశువు మృతి: ఐరాస

ప్రపంచంలో ప్రతి ఆరు సెకన్లకు ఓ శిశువు మృత్యువాత పడుతున్నట్టు ఐక్యరాజ్య సమితి అభిప్రాయపడింది. ఈ మృతులకు ప్రధాన కారణం పోషకాహార లోపమేనని సమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రధాన కార్యదర్శి జాక్వెస్ డయాఫ్ అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా, ఆసియా ఖండ ప్రజలు మున్ముందు ఆకలిదప్పులతో అలమటించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఉన్న దాదాపు 100 కోట్ల మంది అన్నార్తుల్లో మూడింట రెండొంతుల మంది ఈ ఖండంలోని ఏడు దేశాల్లోనే ఉన్నట్టు ఆయన వివరించారు. అయితే ఈ సంఖ్య గత ఏడాది 102 కోట్లుగా నమోదు కాగా, ప్రస్తుతం 92.5 కోట్లుగా ఉందని ఐరాస తాజాగా విడుదల చేసిన ఒక నివేదికలో పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో అలమటించే వారి సంఖ్య ఇదే స్థాయిలో కొనసాగితే 2015 నాటికి పేదరికాన్ని తగ్గించాలన్న సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనకు విఘాతం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సంఖ్య పెరుగుదలను నిరోధించటానికి ప్రపంచ దేశాలు అత్యవసర ప్రాతిపదిక స్పందించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్యసమితి ప్రపంచ ఆహార కార్యక్రమం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జోసెట్‌ షీరన్‌ నొక్కివక్కాణించారు.

No comments:

Post a Comment